హైదరాబాద్, న్యూస్లీడర్, జూన్ 28: కమ్మ, వెలమ సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం భూములు కేటాయించడంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. కులాల వారీగా భూముల కేటాయింపును ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఇలా కేటాయించడం కూడా ఓ విధమైన కబ్జానే అని వ్యాఖ్యానించింది. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 2కి వాయిదా వేసింది. కమ్మ, వెలమ సంఘాలకు 5 ఎకరాల చొప్పున భూములు కేటాయిస్తూ 2021లో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిల్పై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. భూముల కేటాయింపుపై ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవో.. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందని చెప్పింది. అణగారిన వర్గాలకు భూములు ఇస్తే అర్థం చేసుకోవచ్చని.. బలమైన కులసంఘాలకు భూములు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించింది. సాయిసింధు ఫౌండేషన్కు భూకేటాయింపు రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా హైకోర్టు గుర్తుచేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు కమ్మ సంఘానికి ఉన్నత న్యాయస్థానం అనుమతించింది.