వాషింగ్టన్ : శాన్ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయంపై ఖలిస్థాన్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. దహనం చేసేందుకు ప్రయత్నించారు. కొన్ని నెలల వ్యవధిలో రెండోసారి ఈ తరహా దుశ్చర్యకు దుండగులు పాల్పడ్డారు. దీనిని అమెరికా ప్రభుత్వం తీవ్రంగా ఖండిరచింది. నేరపూరిత చర్య అంటూ అభివర్ణించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం..
ఖలిస్థాన్ మద్దతుదారులు రెండు రోజుల క్రితం వేకువజాములో శాన్ఫ్రాన్సిస్కోలో గల భారత దౌత్యకార్యాలయానికి నిప్పంటించారు. అయితే స్థానిక అగ్నిమాపక విభాగం వేగంగా స్పందించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. కానీ ఈ దాడిని అమెరికా తీవ్రంగా ఖండిరచింది. దౌత్యకార్యాలయాలపై ఇటువంటి దాడులు తగదని హెచ్చరించింది. దౌత్య కార్యాలయాలు, విదేశీ దౌత్యవేత్తలపై హింసకు పాల్పడటం వంటి చర్యలను అమెరికాలో తీవ్ర నేరాలుగా పరిగణిస్తుందని అని యూఎస్ విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ట్వీట్ చేశారు.
ఈ దుశ్చర్యకు పాల్పడిన వీడియోను ఖలిస్థాన్ మద్దతుదారులు విడుదల చేశారని అమెరికా ధ్రువీకరించింది. అయితే దీనికి ఎలాంటి ధ్రువీకరణ లేదని మీడియా కథనాలు వెల్లడిరచాయి. ఆ వీడియోలో.. హింస హింసను ప్రేరేపిస్తుందనే వ్యాఖ్యలతో పాటు ఇటీవల కెనడాలో మృతి చెందిన ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్కు సంబంధించిన వార్తా కథనమూ కనిపించింది. గత నెల కెనడాలోని ఓ గురుద్వార్లో నిజ్జర్ను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ సభ్యులకు.. కార్యకలాపాల నిర్వహణ, నెట్వర్క్ ఏర్పాటు చేయడం, శిక్షణ, ఆర్థిక సహకారం వంటివి హర్దీప్ అందిస్తాడు. అతడిపై జాతీయ దర్యాప్తు సంస్థ భారత్లో ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. హర్దీప్ సింగ్కు ‘సిక్ ఫర్ జస్టిస్’ సంస్థతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాలో ఖలిస్థాన్ మద్దతుదారులు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ఇతడి హస్తం ఉంది. హర్దీప్ సామాజిక మాధ్యమ ఖాతాల్లో విద్వేషపూరిత ప్రసంగాలు, చిత్రాలు ఉన్నాయి. గతంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్ ఉన్న సమయంలో కెనడాకు అప్పగించిన మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఇతడి పేరును కూడా చేర్చారు. 2018లో ఈ జాబితాను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు అప్పగించారు.
గతంలోనూ దాడి..
గత మార్చిలో కూడా శాన్ఫ్రాన్సిస్కో దౌత్యకార్యాలయంపై దాడి జరిగింది. ఈ వరుస ఘటనలపై సోమవారం భారత విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందిస్తూ.. భారత్ భాగస్వామ్య దేశాలైన కెనడా, యూకే, యూఎస్, ఆస్ట్రేలియా.. ఈ తరహా అతివాద భావజాలానికి తావివ్వకూడదని, అది దేశాల మధ్య సంబంధాలకు మంచిది కాదని వ్యాఖ్యానించారు.
కెనడా రాయబారికి కేంద్రం సమన్లు..
ఖలిస్థాన్ మద్దతుదారులు జూలై ఎనిమిదిన కెనడాలోని టొరంటోలో స్వేచ్ఛా ర్యాలీకి పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి అంటించిన పోస్టర్లలో ఒట్టావా, టొరంటోలోని దౌత్యవేత్తలపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై స్పందించిన కెనడా ప్రభుత్వం తమ దేశంలోని భారత దౌత్యవేత్తల భద్రతకు కట్టుబడి ఉన్నామని వెల్లడిరచింది. ఈ క్రమంలోనే ఈ ర్యాలీని ఖండిస్తూ భారత ప్రభుత్వం మన దేశంలోని కెనడా రాయబారికి సమన్లు ఇచ్చింది.