నెల్లూరు, న్యూస్లీడర్, జూలై 8 : తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర శనివారానికి 150వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా అల్లూరులో లోకేశ్కు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. లోకేశ్ను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో లోకేశ్ ప్రత్యేక పూజలను నిర్వహించారు.
అనంతరం మహిళలు, యువత, వృద్ధులను లోకేశ్ ఆప్యాయంగా పలకరించి సమస్యలను తెలుసుకున్నారు. పలువురు మహిళలు మాట్లాడుతూ.. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయని, విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచేశారని, సామాన్యులు బతికే పరిస్థితి లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డుకు ఇరువైపులా షాపులు నిర్వహిస్తున్న వ్యాపారస్తులను లోకేశ్ కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. చెత్త పన్ను, బోర్డు పన్ను, ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటూ వ్యాపారస్తులను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని… టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పన్నుల భారాన్ని తగ్గించాలని లోకేశ్ను వ్యాపారస్తులు కోరారు.
లోకేశ్ మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముందు పెట్రోల్, డీజిల్పై పన్ను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. వీటి ధరలు తగ్గితే ఆ ప్రభావం అన్ని రంగాల మీద ఉంటుందని చెప్పారు. అలాగే జగన్ అడ్డగోలుగా పెంచేసిన పన్నులన్నింటినీ తగ్గిస్తామని, విద్యుత్ ఛార్జీల పై పెంచిన భారాన్ని కూడా తగ్గిస్తామని హామీ ఇచ్చారు