అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ప్రమాదం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా.. హోర్డింగ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కార్మికుడికి స్వల్పగాయాలయ్యాయి. అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సీఎం సభాప్రాంగణం దగ్గర ఈ సంఘటన జరిగింది. హోర్డింగ్ కూలడంతో… ఓ కారు కూడా ధ్వంసమైంది.
సీఎం వైఎస్ జగన్ ఈరోజు, రేపు రాయలసీమలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం అనంతపురం జిల్లాలో రైతు దినోత్సవంలో పాల్గొనున్న సీఎం.. కళ్యాణదుర్గంలో ఏపీ మోడల్ స్కూల్ దగ్గర ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. ఖరీఫ్లో పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారాన్ని ఖాతాల్లో జమ చేస్తారు. ఈ తర్వాత కడప జిల్లాకి వెళ్తారు.
వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా YSR ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అలానే రాత్రికి ఇడుపులపాయలోనే ఉంటారు. ఆ తర్వాత ఆదివారం ఉదయం 9.20 నిమిషాలకు గండికోట చేరుకుని ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ను సీఎం జగన్ పరిశీలిస్తారు. ఆ తర్వాత పులివెందులలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. కీలకమైన వైఎస్ఆర్ స్పోర్ట్స్ అకాడమీకి కూడా ప్రారంభిస్తారు. అలానే పలు పారిశ్రామిక యూనిట్లకు శంకుస్థాపన చేస్తారు. 10వ తేదీ మధ్యాహ్నం ఒకటిన్నరకు తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.