ఓటీటీ ఫ్లాట్ఫారాల ఉచిత సబ్స్క్రిప్షన్ పేరిట వచ్చే వాట్సాప్ లింకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి. అత్యాశకు పోయి వాటిని క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం పొంచి ఉంది’ అని ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్ హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, డిస్నీ హాట్స్టార్లకు సంబంధించిన నకిలీ లింకులతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా ఎరవేస్తున్నారని పేర్కొన్నారు. తొలుత ఉచితం పేరిట వాట్సప్నకు నకిలీ లింకులను పంపి ఆకర్శిస్తారని, వాటిని క్లిక్ చేయగానే సంబంధిత ఓటీటీ ఫ్లాట్ఫారానికి చెందిన యాప్ సెల్ఫోన్లో ఇన్స్టాల్ చేయమని చూపుతుందని తెలిపారు. ఇన్స్టాల్ చేయగానే ఓటీపీ కోసం మరొక లింకు వస్తుందని.. ఆ సంఖ్యను నమోదు చేయగానే సెల్ఫోన్ సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతుందని ఎస్పీ వివరించారు.
అనంతరం సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు తెలుసుకుని ఖాతాలు ఖాళీ చేస్తారని హెచ్చరించారు. ఇటువంటి నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా ఈ తరహా లింకులు పంపిస్తే నమ్మి క్లిక్ చేయకూడదని.. తెలియని, పరిచయం లేని వ్యక్తుల నుంచివ వచ్చే సందేశాలకు స్పందించకూడదని తెలిపారు. తెలియని లింకులను ఇతరులకు పంపడం కూడా చేయొద్దని సూచించారు. ఈ విధంగా ఎవరైనా మోసపోతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సైబర్ హెల్ప్లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలని, నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ గార్గ్ ఒక ప్రకటనలో సూచించారు.