గాజియాబాద్, న్యూస్ లీడర్, జూలై 11 విదేశాంగ శాఖలో పని చేస్తున్న ఓ ఉద్యోగి గూఢచర్యానికి పాల్పడ్డాడు. భారత్లో జరుగుతున్న జీ-20 సమావేశానికి సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను పాకిస్థాన్కు చేరవేశాడు. అతడి నిర్వాకంపై నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీన్ పాల్ అనే వ్యక్తి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖలో పని చేస్తున్నాడు. కొంతకాలం క్రితం అతడికి సామాజిక మాధ్యమాల్లో ఓ మహిళ పరిచయమైంది. ఆ తర్వాత వీరిద్దరూ వాట్సాప్లో చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే నవీన్ పాల్.. ఆ యువతికి దేశ భద్రతకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను పంపించాడు. విదేశాంగ శాఖతోపాటు జీ-20 సమావేశానికి సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను నిందితుడు ఆ మహిళకు చేరవేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఫైళ్లను నవీన్ తన ఫోన్లో ‘సీక్రెట్’ అని సేవ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నవీన్ కార్యకలాపాలపై నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో గాజియాబాద్ పోలీసులు మంగళవారం అతడిని అరెస్టు చేశారు. తొలుత ఆ మహిళ ఫోన్ నంబరు.. ఉత్తరప్రదేశ్లోని బరేలీకి చెందినదిగా గుర్తించారు. ఆ తర్వాత ఐపీ అడ్రస్తో ట్రేస్ చేయగా.. ఆ నంబరు కరాచీ నుంచి పని చేస్తున్నట్లుగా తేలింది. అంతేగాక, రాజస్థాన్లోని అల్వార్కు చెందిన ఓ మహిళ.. నవీన్ ఖాతాకు కొంత డబ్బు జమ చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఆ మహిళ ఎవరన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు డబ్బు కోసమే ఈ పని చేశాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.