ఢిల్లీ, న్యూస్లీడర్, జూలై 11 : మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలను సైతం సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. అమరావతి రాజధానిపై దాఖలైన పిటిషన్ల విచారణ ఈ ఏడాది డిసెంబర్కు వాయిదా వేసింది. ఆలోగా ఈ కేసు విచారణ సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
అయితే, ఈ కేసును అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న ఏపీ ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోరగా, అత్యవసరంగా విచారణ సాధ్యం కాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం చెప్పింది. ఆగస్టు నుంచి నవంబరు వరకూ రాజ్యాంగ ధర్మాసనాలు ఉన్నందున అత్యవసర విచారణ సాధ్యపడదని స్పష్టం చేసింది. అమరావతి కేసుపై వాదనలు వినిపించేందుకు 3 గంటల సమయం కావాలని సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ కోరారు. ప్రతివాదులందరికీ నోటీసులు పంపే ప్రక్రియ పూర్తయిందా? అని ధర్మాసనం ప్రశ్నించింది.
ప్రతివాదుల్లో ఇద్దరు చనిపోయారని అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు వెల్లడిరచారు. అయితే, చనిపోయినవారిని జాబితా నుంచి తొలగించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. చనిపోయిన వారిని జాబితా నుంచి తొలగించినట్టయితే మిగిలిన అందరికీ నోటీసులు అందినట్టేనని వెల్లడిరచింది. అయితే, ఇంకా మరికొందరికి నోటీసులు అందలేదని అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. అలా అయితే నోటీసులు అందని ప్రతివాదులందరికీ నోటీసులు పంపాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్ను లీడ్ మ్యాటర్గా పరిగణిస్తూ తదుపరి విచారణను ఈ ఏడాది డిసెంబర్కు వాయిదా వేసింది.