` మద్యం విక్రయాల్లో కుంభకోణం
` జనసేన మాతోనే ఉంది
` వైసీపీ హయాంలో అంతా అస్తవ్యస్తం
` ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతల స్వీకారం
విజయవాడ, న్యూస్లీడర్, జూలై 13 : బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా గురువారం పురంధేశ్వరి బాధ్యతలను స్వీకరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె తన ఛాంబర్లో వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆశీనులయ్యారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆమెకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాన్ని అందించి, మిఠాయి తినిపించి అభినందనలు తెలియజేశారు. పురంధేశ్వరి అధ్యక్ష బాధ్యతల కార్యక్రమానికి పలువురు కీలక నేతలు హాజరయ్యారు. బీజేపీ కార్యాలయం అభిమానులతో కిక్కిరిసి పోయింది.
దారుణంగా రహదారులు
మరోవైపు బాధ్యతలను స్వీకరించిన అనంతరం పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి దారుణంగా ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ చలవతోనే రాష్ట్రంలో రహదారులు నిర్మితమవుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రహదారిని కూడా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రహదారుల దుస్థితిపై ప్రజలను అడిగితే చెపుతారని అన్నారు.
ఒక్క ఆంధ్రప్రదేశ్కే కేంద్ర ప్రభుత్వం రూ.22 లక్షల ఇళ్లను ఇచ్చిందని పురంధేశ్వరి తెలిపారు. అయితే రాష్ట్రంలో 35 శాతం ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి కాలేదని విమర్శించారు. దీనిపై వైసీపీ నేతలు పేదలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ సంస్థ కూడా ముందుకు రాని దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న కంపెనీలు కూడా వరుస పెట్టి ఇతర రాష్ట్రాలను తరలిపోతున్నాయని అన్నారు.
విభజన చట్టంలో పేర్కొన్న కేంద్ర విద్యాసంస్థలను రెండేళ్లలోనే దాదాపు అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని పురంధేశ్వరి చెప్పారు. రాష్ట్రంలో పలు ఎయిర్పోర్టులను కూడా కేంద్రం నిర్మించిందని అన్నారు. ఏపీలో పలు చోట్ల ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని మండిపడ్డారు. దీంతో ఈ అభివృద్ధి పనులను అతీగతీ లేకుండా పోతోందన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రాభివృద్ధి కంటే ఇతర వ్యవహారాలే అధికంగా నడుస్తున్నాయని విమర్శించారు.
కేంద్ర నిధులతోనే అభివృద్ధి పనులు..
రాష్ట్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తామే చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటోందని ఆరోపించారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఈ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్త్తోందని అన్నారు. సచివాలయాల నిర్మాణాలను కూడా కేంద్రం ఇచ్చిన నిధులతోనే నిర్మించారని చెప్పారు. కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా దాదాపు 80 కోట్ల మందికి ప్రతి నెల 5 కిలోల బియ్యం, ఒక కిలో పప్పును ప్రధాని మోడీ అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఏపీలో 90 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని చెప్పారు.
మద్య నిషేధం మాటే మరిచారు..
దశల వారీగా మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ విషయాన్ని విస్మరించిందన్నారు. రాష్ట్రంలో నాసిరకం మద్యాన్ని అమ్ముతున్నారని విమర్శించారు. మద్యం విక్రయాల్లో పెద్ద కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. మద్యం రాష్ట్రంలో భూదోపిడీ, ఇసుక దోపిడీ పెద్ద ఎత్తున జరుగుతోందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని… ఇటీవల రూ. 12 వేల కోట్లను విడుదల చేసిందని తెలిపారు. పోలవరం కట్టడం చేతకాకుంటే కేంద్రానికి అప్పగించాలని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చిన్నచిన్న కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించలేని దుస్థితి ఎందుకు నెలకొందని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ప్రతి రైతుకు రూ.12 వేలు ఇస్తానని చెప్పి జగన్ ఆ తర్వాత చేతులెత్తేశారని విమర్శించారు.
జనసేన మాతోనే ఉంది..
రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధికి కృషి చేస్తానని పురంధేశ్వరి తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తల సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు. ప్రజాహితం కోసం కాకుండా, తన స్వప్రయోజనాల కోసం జగన్ పని చేస్తున్నారని విమర్శించారు. ప్రజల తరపున బీజేపీ పని చేస్తుందన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని… ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామని చెప్పారు. వైసీపీకి అధికారంలో కొనసాగే అర్హత లేదని వ్యాఖ్యానించారు. పొత్తుల విషయాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో బీజేపీతో ఉన్నారని, ఇప్పుడు కూడా బీజేపీతోనే ఉన్నారని చెప్పారు.