విజయవాడ, న్యూస్లీడర్, జూలై 13 : తెలంగాణలో రాష్ట్ర విద్యా శాఖ పనితీరు అస్తవ్యస్తంగా ఉందంటూ ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ రాష్ట్రంలో చూచిరాతలు, కుంభకోణాలను ప్రతి రోజు చూస్తూనే ఉన్నామని విమర్శించారు. విజయవాడలో గురువారం ఏపీ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలను బొత్స ప్రకటించారు. ఈ నెల 20 నుంచి 25 వరకు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యా విధానంపై ఆయన వ్యాఖ్యానిస్తూ… ఏపీ విద్యా విధానాన్ని తెలంగాణతో పోల్చి చూడాల్సి అవసరం కూడా లేదన్నారు. ఉపాధ్యాయుల బదిలీలను కూడా సక్రమంగా చేసుకోలేని దుస్థితిలో తెలంగాణ ఉందని విమర్శించారు. మన విద్యా విధానం మనదని, మన ఆలోచనలు మనవని చెప్పారు.
వాలంటీర్లపై పవన్ చేసిన ఆరోపణల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… పొద్దున్నే పవన్ గురించి మాట్లాడుకోవడం ఎందుకని వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యలను పట్టించుకోకుండా ఉంటేనే మంచిదని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా పుట్టిందనే విషయాన్ని తొలుత పవన్ తెలుసుకోవాలని సూచించారు. దుర్బుద్ధితోనే వాలంటీర్ వ్యవస్థపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వాలంటర్ వ్యవస్థపై అవాకులు, చవాకులు మాట్లాడినా ప్రభావం కచ్చితంగా పవన్కు కనిపిస్తుందన్నారు.