ములుగు మండలం మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థుల అసాంఘిక వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. పాఠశాలలో మద్యం తాగుతూ దొరికిపోగా ఉపాధ్యాయుడిపై నింద మోపేందుకు ప్రయత్నించి ఇరుకున పడ్డారు. విద్యార్థులు మద్యం తాగింది వాస్తవమేనని విచారణలో తేలడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఏమీ మాట్లాడలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న 9 మంది విద్యార్థులు శనివారం రాత్రి మద్యం కొనుగోలు చేసి పాఠశాలకు తీసుకొచ్చి తాగారు. గమనించిన వ్యాయామ ఉపాధ్యాయుడు వారిని మందలించారు. మరో సారి ఇలాంటి పని చేయమని వారితో ఒప్పంద పత్రం రాయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం చెప్పా పెట్టకుండా విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. వ్యాయామ ఉపాధ్యాయుడే మద్యం తాగి తాము తాగినట్లు ఒప్పంద పత్రం రాయించుకున్నాడని తల్లిదండ్రులకు చెప్పారు. పిల్లల మాటలు నమ్మిన తల్లిదండ్రులు మరుసటి రోజు పాఠశాలకు వచ్చి వ్యాయామ ఉపాధ్యాయుడితో పాటు మరి కొంత మంది ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మంగళవారం సాంఘిక సంక్షేమ శాఖ రీజినల్ కో-ఆర్డినేటర్ విద్యారాణి, తహసీల్దారు సత్యనారాయణ స్వామి పాఠశాలకు వెళ్లి విచారణ జరపగా వాస్తవాలు వెలుగు చూశాయి. తొమ్మిదో తరగతి విద్యార్థులు ఏడుగురు, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇద్దరు మద్యం తాగారని తేలింది. వీరిలో ఎక్కువ మంది ఏటూరునాగారం మండలానికి చెందిన వారుగా సమాచారం. ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి పాఠశాలకు రాలేదు.
విద్యార్థులకు మద్యం విక్రయించినందుకు మల్లంపల్లి శ్రీరామ వైన్స్పై కేసు నమోదు చేశామని ములుగు ఎక్సైజ్ సీఐ సుధీర్ కుమార్ తెలిపారు. శనివారం రాత్రి విద్యార్థులు మద్యం కొనుగోలు చేసినట్లు సీసీ ఫుటేజీల ఆధారంగా తేలిందని. 21 సంవత్సరాల లోపు వారికి మద్యం విక్రయించినందుకు దుకాణ యజమానిపై కేసు నమోదు చేసి కమిషనర్కు నివేదిక పంపించామన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు జరిమానా విధించబోతున్నట్లు తెలిపారు.