విశాఖపట్నం, న్యూస్లీడర్, జూలై 15 : ఆంధ్రప్రదేశ్లో వర్షాలు ఊపందుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం చినుకు జాడ కోసం రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో మరో రెండు, మూడు రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఎల్లుండి మరో ఆవర్తనం.. 17, 18 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాలు నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
నైరుతి రుతుపవనాల కారణంగా కోస్తాతో పాటు సీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా.. ఉత్తరాంధ్రలో రెండు, మూడు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. అయితే విశాఖ నగరంలో మాత్రం వర్షాలు పడడం లేదు. ఏలూరు జిల్లా ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో.. వాగులు, వంకలు పొంగుతున్నాయి. కామవరం దగ్గర గుబ్బల మంగమ్మ గుడి రహదారి మూసివేశారు. ఉత్తరాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, రాయలసీమలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు, మరికొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.
అయితే.. ఏపీలోని కొన్ని జిల్లాల్లో మాత్రం నైరుతి రుతుపవనాలు మందగించాయి. చినుకు జాడ కోసం రైతన్నలు ఆశగా ఎదురు చూసే పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో.. వర్షాలు కురవాలంటూ జనం పూజలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో గ్రామ దేవతలకు పూజలు చేశా రు. బాజా భజంత్రీలతో జలాభిషేకాలు నిర్వహించారు.