విజయనగరం, న్యూస్లీడర్, జూలై 15 : టీడీపీ చేపట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర సమయంలో మాజీ మంత్రి అశోక్గజపతిరాజుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులకు దేవదాయ శాఖ అధికారులు షోకాజ్ నోటీసులు పంపారు. విజయనగరం జిల్లాలోని రామతీర్థం ఆలయానికి అనువంశిక ధర్మకర్తగా టీడీపీ సీనియన్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఉన్నారు. ఈ క్రమంలో ఆయన బస్సు యాత్ర సమయంలో ఆలయానికి రాగా అర్చకులు పూర్ణకలశంతో స్వాగతం పలికారు.
అయితే దీన్ని తప్పు పడుతూ ఆలయ ఈవో కిశోర్ కుమార్ ఆరుగురు అర్చకులకు షోకాజ్ నోటీసులు పంపారు. అశోక్కు ఎందుకు స్వాగతం పలికారో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు ఈవో చర్యలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వైసీపీ నేతలకు దమ్ముంటే తమతో పోరాడాలని… పూజలు చేసే పూజారుల మీద మీ ప్రతాపం ఏమిటని విరుచుకు పడుతున్నారు. ఆలయ ఈవో వైసీపీ నేత మాదిరి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.