. గంగిరెడ్డికి వెంటనే బెయిల్ మంజూరు చేయాలన్న న్యాయవాదిపై ఆగ్రహం . సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిాల్లీ, న్యూస్ లీడర్, జూలై 18: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సెప్టెంబరు రెండో వారానికి సుప్రీం కోర్టు మంగళవారం వాయిదా వేసింది. ఈ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. వివేకా హత్య కేసు చాలా కీలకమైన అంశమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ను సెప్టెంబర్ 2వ వారానికి వాయిదా వేసింది. వివేకా హత్య కేసు వివరాలు, డైరీని సీల్డ్ కవర్లో అందించాలని సీబీఐని ఆదేశించింది. అవినాశ్ బెయిల్ రద్దు పిటీషన్పై కౌంటర్ను కూడా సీల్డ్ కవర్లో దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అవినాశ్ రెడ్డి, మరో నిందితుడు గంగిరెడ్డి బెయిల్ పిటిషన్లను కలిపే వింటామని సుప్రీం స్పష్టం చేసింది. గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనలను వేరుగా వినాలని ఆయన తరపు లాయర్ విన్నవించిన నేపథ్యంలో సుప్రీం ఈ మేరకు స్పష్టతనిచ్చింది. ఇద్దరి బెయిల్ పిటిషన్లను జత చేసింది. గంగిరెడ్డికి వెంటనే బెయిల్ మంజూరు చేయాలన్న ఆయన న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్యకేసుకు సంబంధించిన బెయిల్ వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పింది. ఎన్నో సాక్ష్యాలను పరిశీలించాల్సి ఉంటుందని…బెయిల్ కోసం వేచిచూడక తప్పదని తెలిపింది. గంగిరెడ్డికి జూన్ 30న బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఇప్పటికే స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు అవే ఉత్తర్వులు కొనసాగుతాయని చెప్పింది.