అమరావతి, న్యూస్ లీడర్, జూలై 19: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరికొన్ని గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే ఐదు రోజులపాటు ఏపీలోని వివిధ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడిరచింది. మరోవైపు, దక్షిణ ఛత్తీస్ గఢ్ ప్రాంతంలో మరో ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఐదు రోజులపాటు సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఏపీలోని ఉత్తర కోస్తాపై అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, మిగతా ప్రాంతాలతోపాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడిరచింది. ఏజెన్సీ, కొండ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదవుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. గడచిన 24 గంటల్లో అత్యధికంగా చింతూరులో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అల్లూరి జిల్లా ఏజెన్సీలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పాడేరు మండలం రాయగడ వంతెన పొంగి 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పర్దనపుట్టు మత్స్యగెడ్డ పొంగి 50 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది.