` అధిష్ఠానం ఆదేశిస్తే తప్పుకుంటా ` రాష్ట్రంలో అల్లర్లకు అక్రమ వలసదారులే కారణం ` రాష్ట్రంలో శాంతి నెలకొల్పడంపైనే దృష్టి ` బీరేన్ సింగ్ వెల్లడి
ఇంఫాల్, న్యూస్ లీడర్, జూలై 26 : తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వినిపిస్తున్న ప్రచారంపై మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ స్పందించారు. తాను రాజీనామా చేసే సమస్యే లేదని తేల్చిచెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ కార్యకర్తనని, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రినని అన్నారు. పార్టీ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించే విధేయత గల కార్యకర్తనని వివరించారు. అధిష్ఠానం ఆదేశిస్తే పదవి నుంచి తప్పుకుంటానని వివరించారు. మణిపూర్లో హింసకు, అల్లర్లకు కారణం అక్రమంగా వలస వచ్చిన వారేనని ఆరోపించారు.
రాష్ట్రంలో మైతేయిలు, కుకీలతో పాటు 34 తెగల ప్రజలు ఐకమత్యంగా నివసిస్తున్నారని చెప్పారు. మే 3న నిర్వహించిన గిరిజన తెగల ర్యాలీ వల్లే రాష్ట్రంలో హింస చెలరేగిందని, డ్రగ్ స్మగ్లర్లు కూడా ఈ అల్లర్లకు కారణమని చెప్పారు. ప్రస్తుతం తన దృష్టి అంతా రాష్ట్రంలో శాంతి నెలకొల్పడంపైనే ఉందని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం, ఆర్మీ బలగాలు రాష్ట్రంలో శాంతి స్థాపనకు కృషి చేస్తున్నాయని వివరించారు. త్వరలోనే రాష్ట్రంలో సాధారణ పరిస్థితి నెలకొంటుందని చెప్పారు.