చేబ్రోలు, న్యూస్ లీడర్, జూలై 27: ఉన్నత శిఖరాలకు చేరాలనే ఆశతో విదేశాలకు వెళ్లిన ఆ యువకుడిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. ఆ కుటుంబంలో పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని గొడవర్రు గ్రామానికి చెందిన ఆరాధ్యుల యజ్ఞనారాయణ, భూలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సుధీర్కుమార్ తపాలాశాఖలో విధులు నిర్వహిస్తున్నారు. చిన్న కుమారుడు కిరణ్కుమార్(25) ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. రెండున్నరేళ్ల కిందట లండన్ వెళ్లి ఎంఎస్ పూర్తి చేశాడు. ఉద్యోగం సంపాదించడానికి నిపుణుల సూచన మేరకు కొన్ని కోర్సుల్లో ప్రావీణ్యం కోసం శిక్షణ తరగతులకు హాజరవుతున్నాడు. జూన్ 26న ద్విచక్ర వాహనంపై తరగతికి హాజరవడానికి వెళ్తుండగా అదే సమయంలో పోలీసులు ఓ దొంగను వెంటాడుతున్నారు. ఆ దొంగ వేగంగా వెళ్తూ.. కిరణ్ను ఢీకొట్టాడు. తీవ్ర గాయాలపాలైన కిరణ్ను పోలీసులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నెలపాటు వివిధ ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రవాస భారతీయుల సహకారంతో కిరణ్ మృతదేహాన్ని లండన్ నుంచి స్వదేశానికి విమానంలో తరలిస్తున్నారు.