. పోలవరానికి పోటెత్తుతున్న వరద . భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ . నిండుకుండలా మారిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు
భద్రాచలం, న్యూస్ లీడర్, జూలై 27: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది.బుధవారం మధ్యాహ్నం నదిలో నీటి మట్టం 43 అడుగులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రాత్రి 10 గంటల సమయానికి 48 అడుగులకు ప్రవాహం పెరిగింది. దీంతో గురువారం వేకువ జామున రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి వరద అంతకంతకూ పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా వరద పోటెత్తుతోంది. మరోవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారింది. ఏ క్షణమైనా గేట్లు ఎత్తి నీటిని కిందకు విదుదల చేసే అవకాశం ఉంది. ఇంకోవైపు కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు స్వల్పంగా వరద నీరు వస్తోంది.