టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వెల్లడి
అనంతపురం, న్యూస్లీడర్, జూలై 28 : రాయలసీమలో సాగు నీటి ప్రాజెక్టులు పరిశీలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ప్రాంతంలో పర్యటించనున్నట్టు టీడీపీ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఆగస్టు 1 నుంచి ఈ పర్యటన ఉంటుందని ఆయన వెల్లడిరచారు. శుక్రవారం ఆయన అనంతపురంలో కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ.. కర్నూలు, కడప పర్యటన తర్వాత ఆగస్టు 3న చంద్రబాబు అనంతపురం జిల్లాకు రానున్నట్టు తెలిపారు. 4న కళ్యాణదుర్గంలో బైరవానితిప్ప ప్రాజెక్టు, పేరూర్లో ఇతర ప్రాజెక్టులు పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులపై పరిశీలన జరుగుతుందని కాలవ శ్రీనివాసులు ప్రకటించారు. రాయలసీమ భవిష్యత్తుతో సీఎం జగన్ ఆటలాడుకుంటున్నారని విమర్శించారు. కరవు జిల్లాలకు నీరు అందించే ప్రాజెక్టులను జగన్ ఆపేశారని ఆరోపించారు. సీఎం అసమర్థత వల్ల రాయలసీమలో వేరుశనగ పంట దిగుబడి తగ్గిందని మండిపడ్డారు.
రాయలసీమ జీవనాడి వంటి హంద్రీ`నీవా వెడల్పును ఈ ప్రభుత్వం ఆపేసిందని, పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మిస్తానని చెప్పి టెండర్లు కూడా పిలవలేదని మండిపడ్డారు. పనులు ఆపివేసి అనంతపురం జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. జిల్లా మనుమడినని చెప్పి ముఖ్యమంత్రి ప్రాజెక్టులు ఆపివేసి నయవంచనకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ వైఫల్యాలను ఎందగట్టేందుకు చంద్రబాబు పర్యటించనున్నట్టు చెప్పారు. రైతులు పెద్ద ఎత్తున పాల్గొని చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.