` దీని వెనుక కుట్ర కోణం దాగి ఉంది
` కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఢిల్లీ, న్యూస్లీడర్, జూలై 28 : మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, అనంతరం వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. మహిళల నగ్న వీడియో విడుదల వెనుక కుట్ర ఉన్నట్టు ప్రాథమికంగా తెలుస్తోందని అన్నారు. పార్లమెంటు సమావేశాలకు ముందు మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో ఈ కుట్ర జరిగిందని మండిపడ్డారు. 1990వ దశకం నుంచి మణిపూర్లో కుకీ, మెయిటీ తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని అన్నారు. మహిళను నగ్నంగా చిత్రీకరించిన ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మణిపూర్లో పరిస్థితి అస్తవ్యవ్తంగా ఉన్న నేపథ్యంలో మరింత రెచ్చగొట్టడం కోసం ఈ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారని చెప్పారు. ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగినట్టు తెలుస్తోందని అన్నారు.
మరోవైపు మణిపూర్ ఘర్షణలకు సంబంధించి ఏడు కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించామని అమిత్ షా చెప్పారు. మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసు కూడా వీటిలో ఉందని తెలిపారు. ఈ కేసుల విచారణ వేరొక రాష్ట్రంలో జరగాలని సుప్రీంకోర్టును కోరామని చెప్పారు.