. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ వెల్లడి . జూన్లో 9 శాతం లోటు వర్షపాతం . జూలైలో 13 శాతం అధిక వర్షపాతం
విశాఖపట్నం,న్యూస్ లీడర్, ఆగస్టు 1: ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. వచ్చే రెండు నెలల్లో 94 నుంచి 99 శాతం మధ్యలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో మాత్రం సాధారణంకంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నారు. ఎల్నినో కారణంగా వర్షాకాలంలో రెండో అర్ధభాగంలో వర్షాలు తగ్గుతుంటాయన్నారు. జూన్లో దేశవ్యాప్తంగా 9 శాతం లోటు వర్షపాతం నమోదైతే, జులైలో 13 శాతం అధిక వర్షాలు కురిసినట్టు చెప్పారు. 1901 తర్వాత తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో తొలిసారి జులైలో అత్యల్ప వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నారు. జులైలో దేశంలో 1113 భారీ, 205 అతి భారీ వర్షాలు కురిసినట్టు వివరించారు. గత ఐదేళ్లలో ఇదే అత్యధికమని మృత్యుంజయ పేర్కొన్నారు.