. తక్షణమే అమల్లోకి…
. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆదేశాలు
ఢిల్లీ, న్యూస్లీడర్, ఆగస్టు 3: విదేశాల నుంచి ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. సరైన అనుమతులుంటే.. వాటిని దిగుమతి చేసుకునేందుకు వీలు కల్పించనున్నట్లు తెలిపింది.‘హెచ్ఎస్ఎన్ 8741 కింద దిగుమతి చేసుకునే ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, వ్యక్తిగత కంప్యూటర్లు, అల్ట్రా స్మాల్ ఫామ్ ఫ్యాక్టర్ కంప్యూటర్లు, సర్వర్లపై ఆంక్షలు విధిస్తున్నాం’ అని వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్లడిరచింది. అయితే, బ్యాగేజీ రూల్స్ కింద చేసుకునే దిగుమతులకు ఈ ఆంక్షలు వర్తించబోవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బ్యాగేజీ రూల్స్ అంటే.. దేశంలోకి ప్రవేశించే ప్రతి ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తారు. దీని ప్రకారం.. విదేశాల్లో ల్యాప్టాప్లు, ట్యాబ్లు కొనుగోలు చేసి కస్టమ్స్ వద్ద సరైన ధ్రువపత్రాలు చూపిస్తే వాటిని అనుమతిస్తారు. ఇక ఈ కామర్స్ పోర్టల్స్లో కొనుగోలు చేసి పోస్ట్ లేదా కొరియర్ ద్వారా దిగుమతి చేసుకునే ల్యాప్టాప్లు, ట్యాబ్లు, కంప్యూటర్లకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు కల్పించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. అంతేగాక, రీసర్చ్ అండ్ డెవలప్మెంట్, బెంచ్మార్కింగ్, మరమ్మతులు, రీ-ఎక్స్పోర్ట్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ కోసం దిగుమతి చేసుకునే వాటికి ఈ ఆంక్షలు వర్తించబోవని పేర్కొంది. అయితే ఇలా దిగుమతి చేసుకునే వాటిని ఎట్టి పరిస్థితుల్లో విక్రయించకూడదని స్పష్టం చేసింది. ఇలా దిగుమతి చేసుకున్న ల్యాప్టాప్లు, ట్యాబ్లను పని పూర్తయిన తర్వాత ధ్వంసం చేయడమో లేదా తిరిగి ఎగుమతి చేయడమో చేయాలని సూచించింది.