3295 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం
అమరావతి, న్యూస్లీడర్, ఆగస్టు 3: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలలో పూర్తి స్ధాయి రెగ్యులర్ సిబ్బంది నియామకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. యూనివర్సిటీల్లో 2635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లుతో పాటు, ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులు మొత్తం 3295 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్ ఐటీలలో అధ్యాపకుల నియామకాలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖలో 51వేల పోస్టుల భర్తీ చేశాం, విశ్వవిద్యాలయాల్లో కూడా పూర్తి స్ధాయిలో ఖాళీలను భర్తీ చేయాల్సిందేనన్నారు. యూనివర్సిటీలలో ఉత్తమ ఫలితాలు సాధించాలంటే పూర్తి స్ధాయిలో రెగ్యులర్ పోస్టుల భర్తీ చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. నిర్దేశించిన ప్రమాణాలతో అభ్యర్ధులు కచ్చితంగా క్వాలిఫై కావాలి, నూటికి నూరుశాతం మెరిట్ ఉండాలన్నారు. అదే విధంగా ఇప్పటికే కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న వారికి సంవత్సరానికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు వెయిటేజ్ ఇవ్వాలని ప్రతిపాదించిన అధికారులు. ఇంటర్వ్యూ టైంలో ఈ వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయించారు. పిల్లలు యూనివర్సిటీల నుంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో బయటకు రావాలంటే బోధనా సిబ్బంది నియామకాలు, అర్హత ప్రమాణాలు కచ్చితంగా నాణ్యతగా ఉండాలన్నారు. 1.30 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకాలను ఎలాంటి లోపాలు లేకుండా సకాలంలో నిర్వహించామన్నారు. అదే తరహాలో యూనివర్సిటీల అధ్యాపకుల నియామకాల ప్రక్రియలోనూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా త్వరితగతిన చేపట్టాలన్నారు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై షెడ్యూల్, పరీక్షా విధానంపై సీఎంకు అధికారులు వివరాలందించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన షెడ్యూల్, ఈ నెల 23న యూనివర్సిటీల్లో 3295 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. సెప్టెంబరు 3,4 వారాల్లో ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించనుంది, ఆన్లైన్లో పరీక్షా విధానం ఉంటుందన్నారు. 10 అక్టోబరు కల్లా పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి, రిటన్ టెస్ట్ ఫలితాలు విడుదల అనంతరం నెల రోజుల్లో ఇంటర్వ్యూలు నిర్వహణకు నిర్ణయించారు. నవంబరు 15 నాటికి ఇంటర్వ్యూల సహా నియామక ప్రక్రియ పూర్తి కానుంది. అదే రోజు అన్ని ఎంపికైన అభ్యర్ధుల జాబితాను యూనివర్సిటీలు డిస్ప్లే చేయనున్నారని తెలిపారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె. శ్యామలరావు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి(హెచ్ఆర్) చిరంజీవి చౌదరి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె. హేమచంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సెక్రటరీ ప్రదీప్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.