ఏపీలో రెండు నకిలీ యూనివర్శిటీలు
. ఓ ప్రకటనలో యూజీసీ వెల్లడి
. గుంటూరు, విశాఖల్లో ఒక్కొక్కటి
. దేశవ్యాప్తంగా మొత్తం 20 వర్శిటీలకు గుర్తింపులేదని వెల్లడి
. ఆ వర్సిటీలు ఇచ్చే డిగ్రీలు చెల్లవని ప్రకటన
. దేశ రాజధానిలోనే ఎనిమిది…
ఢిల్లీ, న్యూస్లీడర్, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్లోని రెండు యూనివర్శిటీలు నకిలీవిగా యూనివర్శిటీలు గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తేల్చింది. వాటికి డిగ్రీలు ప్రదానం చేసే అధికారం లేదని స్పష్టం చేసింది. ఆ యూనివర్సిటీలు జారీ చేసే డిగ్రీలతో ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని ప్రకటించింది. యూజీసీ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా వాటిని నిర్వహిస్తున్నట్లు గుర్తించి ఈ ప్రకటన విడుదల చేసింది. గుంటూరు జిల్లా కాకుమానివారితోటలో క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీతోపాటు విశాఖపట్నంలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియాలను యూజీసీ నకిలీ యూనివర్సిటీలుగా ప్రకటించింది. వీటితోపాటు దేశవ్యాప్తంగా మొత్తం 20 ఫేక్ యూనివర్శిటీలను గుర్తించినట్లు తెలిపింది. ఇందులో దేశ రాజధాని ఢిల్లీలోనే 8 నకిలీ యూనివర్శిటీలున్నాయని పేర్కొంది. ఉన్నత విద్య కోసం యూనివర్సిటీలలో చేరేముందు సదరు యూనివర్శిటీకి యూజీసీ గుర్తింపు ఉన్నది లేనిదీ చెక్ చేసుకోవాలని విద్యార్థులను యూజీసీ హెచ్చరించింది.
ఆ 20 నకిలీ యూనివర్సిటీలు ఇవే..
ఢిల్లీలో…ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్, కమర్షియల్ యూనివర్శిటీ లిమిటెడ్ (దర్యాగంజ్), యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, వొకేషనల్ యూనివర్శిటీ, ఏడీఆర్ సెంట్రిక్ జ్యూరిడికల్ యూనివర్శిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్, విశ్వకర్మ ఓపెన్ యూనివర్శిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయాలున్నాయి. ఉత్తరప్రదేశ్లో గాంధీ హిందీ విద్యాపీఠ్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ, భారతీయ శిక్షా పరిషత్లు, మిగతా రాష్ట్రాల్లో.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ (పశ్చిమ బెంగాల్), ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ (పశ్చిమ బెంగాల్), బదగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ (కర్ణాటక), సెయింట్ జాన్స్ యూనివర్సిటీ (కేరళ), రాజా అరబిక్ యూనివర్సిటీ (మహారాష్ట్ర), శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (పుదుచ్ఛేరి)లున్నాయి.