` ఆ రాష్ట్రం మన దేశంలో భూభాగమే.. ప్రధాని గుర్తించడం లేదు
` మీకు చిత్తశుద్ధి ఉంటే.. అక్కడ శాంతి నెలకొనేది
` ప్రధాని ‘వారిద్దరి’ మాట తప్ప ఎవరి మాట వినరు
` అవిశ్వాసంపై చర్చలో కేంద్రంపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
` ప్రధాని లక్ష్యంగా తీవ్ర విమర్శలు
ఢిల్లీ, న్యూస్లీడర్, ఆగస్టు 9 : ‘మణిపూర్ మండిపోతున్నా ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం అక్కడకు వెళ్లలేదు. ఎందుకంటే ఆయన దృష్టిలో మణిపూర్ లేదు. ఇప్పుడు మణిపూర్లో ఏమీ లేదు. అంతా నాశనం అయింది. అక్కడ భరతమాతను హత్య చేశారు. మీరు దేశ ద్రోహులు, దేశ ప్రేమికులు కాదు. అందుకే ప్రధాని మణిపూర్కు వెళ్లడం లేదు’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ లోక్సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రెండోరోజైన బుధవారం చర్చ సాగింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటలకు అవిశ్వాసంపై చర్చను ప్రారంభించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చర్చను ప్రారంభించారు. తొలుత చర్చను ప్రారంభించిన రాహుల్ గాంధీ తన సభ్యత్వాన్ని పునరుద్ధరించినందుకు స్పీకర్ ఓం బిర్లాకు ధన్యవాదాలు తెలిపారు. రాహుల్ గాంధీ ప్రసంగం ఆసాంతం ఆవేశపూరితంగా సాగింది. విమర్శలతో బీజేపీపై విరుచుకు పడ్డారు. ప్రధాని మోడీ లక్ష్యంగా విరుచుకుపడ్డారు.
తత్వం బోధపడిరది
ఇటీవల తాను చేసిన భారత్ జోడో యాత్ర గురించి సభలో ప్రస్తావిస్తూ.. సముద్ర తీరం, మంచు పర్వతాలు, రహదారులు, కొండలు దాటుకుంటూ జోడోయాత్ర నిర్వహించాను. పాదయాత్ర గురించి పలువురు ప్రశ్నించారు. నిజంగా.. వారికి ఏం చెప్పాలో నాకు తెలియలేదు. కానీ, యాత్ర మొదలైన కొన్నాళ్లలోనే విషయం నాకు తత్వం బోధపడడం మొదలైంది. ఎందుకోసం నేను మరణానికి కూడా సిద్ధమో.. దేనికోసం జైళ్లకు వెళ్లడానికి సిద్ధమో.. అది అర్థం కావడం మొదలైంది. కొన్నాళ్లుగా నేను నిత్యం దాదాపు 10 కిలోమీటర్ల పరిగెత్తేవాడిని. అలాంటిది రోజుకు పాతిక కిలోమీటర్లు నడవడం ఏముంది అనుకున్నా. అప్పట్లో నాలో అహంకారం ఉంది. కానీ, ఆ అహంకారాన్ని భారత్ ఒక్క క్షణంలో మాయం చేసింది. జోడో యాత్ర ప్రారంభించిన రెండు, మూడు రోజుల్లోనే నాకు ఒళ్లు నొప్పులు మొదలయ్యాయి. నాలో ఉన్న అహంకారం మాయమైంది. ఈ యాత్రలో ప్రజలు నాకు అండగా నిలిచారు. జనసందోహాన్ని చూసి ఒక్కోసారి మాట్లాడలేకపోయా. ప్రతి రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 8 గంటల వరకు వివిధ వర్గాలు చెప్పింది విన్నాను. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కారణం మణిపూర్లో జరుగుతున్న హింసాకాండేనని స్పష్టం చేశారు. మణిపూర్ కూడా భారత్లో భాగమేనని కేంద్ర ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. అక్కడి ప్రజల కష్టాలను, సమస్యలను తీర్చాలని సూచించారు.
హృదయవిదారక దృశ్యాలు..
కొన్ని రోజుల క్రితమే నేను మణిపూర్ వెళ్లాను. అక్కడి పునరావాస శిబిరాల్లో తలదాచుకున్న మహిళలు, పిల్లలతో మాట్లాడాను. అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మీకే ఏం జరిగింది? అని ఓ మహిళను ప్రశ్నించాను. దీనికి ఆమె స్పందిస్తూ.. నాకు ఒక్కడే కొడుకు. వాటిని నా కళ్లెదుటే దుర్మార్గంగా కాల్చిచంపారు. ఆ రోజు రాత్రి మొత్తం నా బిడ్డ శవం వద్దే పడిగాపులు కాచాను. చాలా భయం వేసింది. చివరికి ఏమీ చేయలేని పరిస్థితిలో నా సర్వస్వం వదిలి కట్టుబట్టలతో అక్కడి నుంచి వచ్చేశాను అని చెప్పింది. తనకు ఇప్పుడు ఒంటిపై ఉన్న బట్టలు మాత్రమే ఉన్నాయి అంటూ రోధించింది.
ఈ క్రమంలోనే ఓ రైతు నా వద్దకు వచ్చాడు. అతడికి పంటల బీమా దక్కిందా? అని అడిగాను. అటువంటిది ఏమీ లేదని చెప్పాడు. ఆ క్షణంలో రైతు మనసులోని బాధను నేను అనుభవించాను. అతడి ఆకలి బాధ నాకు తెలిసొచ్చింది. ఆ తర్వాత యాత్ర తీరు మారిపోయింది. నాటి నుంచి చుట్టుపక్కల ప్రజల నినాదాలు నాకు వినిపించేవి కాదు. నాకు కష్టాలు చెప్పుకొనే వారి ఆవేదన మాత్రమే వినిపించేది. ఈ దేశాన్ని భూమి, బంగారం, భాషల పేరుతో రకరకాలుగా పిలుస్తుంటారు. కానీ, ఈ దేశం ఓ గొంతుక. దానిని వినాలంటే మన మనసులోని అహంకారాన్ని, ద్వేషాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే భారతదేశం ఆత్మ మనకు తెలుస్తుంది అని రాహుల్ అన్నారు.
‘‘మరో క్యాంపులో ఓ సోదరిని ప్రశ్నించగా.. ఆమెకు జరిగింది గుర్తు చేసుకొని నిలువునా వణికిపోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత స్పృహ కోల్పోయింది. ఇలాంటి హృదయ విదారక దృశ్యాలను ఎన్నింటినో చూడాల్సి వచ్చింది. మీకు చెప్పినవి కేవలం మూడు ఘటన గురించి మాత్రమే అని రాహుల్ ఉద్వేగంగా అన్నారు.
స్పీకర్ సర్.. అందుకే అంటున్నాను. పాలకులు మణిపుర్లో భారత్ను హత్య చేశారు. దేశం ప్రాణం తీశారు. నేను ప్రసంగం మొదట్లో చెప్పినట్లు భారత్ ఓ గొంతు.. అది ప్రజల హృదయ స్పందన. దానిని చంపేశారు అని రాహుల్ తీవ్రంగా విమర్శించారు.
మీరు తలచుకుంటే సాధ్యం కాదా?
మణిపూర్కు మన సైన్యాన్ని పంపండి. ఒక్కరోజులోనే అక్కడ ఒక్కరోజులేనే శాంతి నెలకొల్పుతుంది. కానీ మీకు చిత్తశుద్ధి లేదే? అదే కదా సమస్య అంటూ ప్రధాని వైఖరిపై రాహుల్ విమర్శలు చేశారు. ప్రధాని ఇద్దరి మాటలు మాత్రమే వింటారు. అదానీ కోసం మోడీ ఏం చేశారో చూడండి. రావణాసురుడు మేఘనాథుడు, కుంభకర్ణుడి మాటే వింటాడు. అలానే మోడీ.. అదానీ, అమిత్షా మాటలే వింటారు. లంకను రావణుడి అహంకారమే కాల్చింది. దేశంలో మీరు కిరోసిన్ చల్లుతున్నారు. మణిపూర్లో చల్లారు. ఇప్పుడు హరియాణాలో చల్లుతున్నారు’’ అన్న తీవ్ర విమర్శలతో రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ముగించారు.
సభలో గందరగోళం..
రాహుల్ వ్యాఖ్యలతో సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. పాలకపక్ష సభ్యులు ఆయన మాటలకు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ధాటిగా కొనసాగించారు. ప్రసంగం మధ్యలో కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు జోక్యం చేసుకొని మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పాలకుల చేసిన దానికి రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.