తన తల్లిని, చెల్లిని, తనను నమ్మించి గోదావరి నదిలోకి నెట్టేశాడని 13 సంవత్సరాల బాలిక కీర్తన కన్నీరు పెట్టుకుంది. ఇటీవల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గౌతమి పాత వంతెన వద్ద వివాహిత, ఇద్దరు పిల్లలను గోదారిలో తోసేసిన ఘటనలో ప్రాణాలతో బయటపడిన కీర్తనను గుంటూరు జిల్లా తెనాలిలోని ఆమె పెద్దమ్మకు అధికారులు అప్పగించారు.
మంగళవారం అక్కడికి వెళ్లిన విలేకరులతో బాలిక మాట్లాడుతూ.. ‘మాది తాడేపల్లి, అమ్మ ఎంసీఏ చదివి కొన్ని కారణాల వల్ల హోటల్లో గ్రైండర్ వద్ద పని చేసేది. అక్కడే సురేష్ అనే వ్యక్తి 2018లో పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి కలిసి ఉంటున్నారు. గత ఏడాది ఆగస్టులో నాకు చెల్లెలు పుట్టింది. తర్వాత అతను అమ్మను పట్టించుకోవడం మానేశాడు. గొడవలు జరిగాయి. మేము తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టాం.
ఆ గొడవల నేపథ్యంలో ఈ నెల 5న తాను కారు కొన్నానని, సరదాగా వెళ్లివద్దామని అమ్మకు మాయమాటలు చెప్పాడు. అందరం బయలుదేరి వెళ్లాం. ఆదివారం తెల్లవారుజామున రావులపాలెం వద్ద ముగ్గురినీ గోదావరిలోకి తోసేశాడు. అమ్మ, చెల్లెలు నదిలో పడిపోయారు. నా చేతికి పైపు తగలడంతో అది పట్టుకున్నాను. నా వద్దనున్న ఫోన్తో 100కు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి రక్షించారు’ అని వివరించింది. అందరమూ కలిసి ఉందామని అమ్మను నమ్మించి ఇలా చేశాడని బాలిక కన్నీటి పర్యంతమైంది.