రోలుగుంట, న్యూస్లీడర్, ఆగస్టు 8: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు నాలుగు కిలోమీటర్ల మేర డోలీ యాత్ర చేపట్టారు. తమ గ్రామాలకు రోడ్లు వేయాలని, నీలబంధ గ్రామానికి విద్యుత్ సరఫరా సౌకర్యం కల్పించాలంటూ ఈ నెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సోమవారం గిరిజనులంతా రోడ్డెక్కారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయితీ నిలబంధ గ్రామంలో డోలీ యాత్ర ప్రారంభించి పిత్రుగెడ్డ, పెద్దగరువు గ్రామాల మీదుగా జాజులబంద వరకు వెళ్లి అక్కడ ముగించారు. అర్ల నుంచి పెద్దగరువు, పిత్రుగెడ్డ, జాజులబంద వంటి కొండ శిఖర గ్రామాలకు తక్షణమే రోడ్లు వేయాలని వారంతా డిమాండ్ చేశారు. ఆయా ప్రాంతాల్లో ఎస్టీ కోందు తెగకు చెందిన సుమారు 300 మంది కొండపైనే జీవనం సాగిస్తున్నారు. 2020లో ఒక్కో ఇంటికి రూ.10వేల చొప్పున చందాలు పోగు చేసుకుని రూ.7లక్షల సొంత ఖర్చుతో ఆదివాసీలే రోడ్డు నిర్మించుకున్నారు. అయితే వర్షాకాలం నేపథ్యంలో ఆ రోడ్డు కాస్త కొట్టుకుపోయింది. అదే విధంగా జ్వరాల బారిన పడితే కి.మీ మేర రోగుల్ని డోలీల్లో మోసుకుంటూ ఆస్పత్రులకు తీసుకు వెళ్లాల్సి వస్తోంది. కుంబర్ల గ్రామానికి చెందిన పాంగి రోజా అనే మహిళ అత్యవసర వేళ సరైన సౌకర్యాలు లేకపోవడంతో అడవితల్లి ఒడిలోనే కన్నుమూసింది. ఈ విధంగా అనేక మంది మర్గమధ్యంలోనే మృతి చెందుతున్న పరిస్థితులున్నాయి. దీంతో సోమవారం భారీ సంఖ్యలో గిరిజనులు చేరుకుని ‘పలకరా అన్నలూ..ఎన్నాళ్లీ డోలీ మోతలు’ అని నినాదాలు చేసుకుంటూ డోలీయాత్రం నిర్వహించారు.