` పాక్ ఉగ్రవాదుల భరతం పట్టే పనిలో నిమగ్నం ` ఆఫ్ఘనిస్థాన్లో దాడులకు తెగబడుతున్న పాక్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ` గత ఏడాది తాలిబన్లు మట్టుబెట్టిన వారిలో 18 మంది పాక్ జాతీయులు
కాబూల్ : పాక్ ఉగ్రవాదుల భరతం పట్టేందుకు భారత్ దారిలో నడవాలని ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వం నిర్ణయించింది. పాక్ జాతీయులు ఐఎస్ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలతో చేతులు కలుపుతూ తమ దేశంలో దాడులకు దిగుతున్నారని తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులపై పోరు కోసం భారత్ పంథానే ఎంచుకోవాలని భావిస్తోంది.
కాగా, తమ దేశంలో పాకిస్థాన్ ఉగ్రదాడులకు పాల్పడుతోందని ఆఫ్ఘనిస్థాన్ ఆరోపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పాకిస్థాన్ ఆర్మీపై తాలిబన్లు ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నారని పాక్ ఆరోపించిన నేపథ్యంలో తాలిబన్లు వాటిని తిప్పికొడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమను నిందించడం మాని తొలుత మీ ఇంటిని చక్కదిద్దుకోవాలని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ సూచించారు.
కాగా, గత ఏడాది కాలంలో ఆఫ్ఘనిస్థాన్లో పలువురు పాక్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు హతమవగా మరికొందరు పట్టుబడ్డారు. తాము హతమార్చిన ఉగ్రవాదుల్లో 18 మంది పాక్ జాతీయులేనని జబీహుల్లా తెలిపారు. మరెంతోమంది తమ జైళ్లలో మగ్గుతున్నట్టు వివరించారు.