. మూడు పెళ్లిళ్లు చేసుకొని మళ్లీ పెళ్లికి సిద్ధమైన వేళ…
. కోర్టు ఆవరణలో కలకలం
. పోలీసుల కేసు నమోదు
జార్ఖండ్, న్యూస్లీడర్, ఆగస్టు 5: రాంచీ సివిల్ కోర్టు పరిసరాల్లో ఒక న్యాయవాదిని అతని భార్యలతోపాటు ఇతర లాయర్లు చితక్కొట్టారు. తన భర్త నాలుగో పెళ్లికి సిద్ధం అయ్యాడని అతని ముగ్గురు భార్యలు ఆరోపిస్తున్నారు. సదరు న్యాయవాది భార్యలకు తమ భర్త నాలుగో వివాహం చేసుకునేందుకు సిద్ధం అయ్యాడనే విషయం తెలియగానే వారు కోర్టుకు చేరుకుని, భర్తపై దాడి చేశారు. దీంతో కోర్టు పరిసరాల్లో కలకలం చెలరేగింది. కోర్టు ప్రాంగణంలో ఆ లాయర్కు అతని ముగ్గురు భార్యలకు మధ్య జరిగిన వివాదం స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. ఈ భార్యాభర్తల గొడవలో జోక్యం చేసుకున్న స్థానికులంతా కలసి ఆ లాయర్పై తలొదెబ్బ వేశారు. తమ భర్త తమ కళ్లగప్పి, నాలుగో వివాహం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని, అతనికి బుద్ధి చెప్పేందుకే ఇక్కడికి వచ్చామని అతని భార్యలు మీడియాకు తెలిపారు. నయీముద్దీన్ ఉరఫ్ నూరి అనే న్యాయవాది ముగ్గురు భార్యలు మీడియాతో మాట్లాడుతూ తమ భర్త అతని దగ్గర పనిచేసే జూనియర్తో అనైతిక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు. ఆమెను నాలుగో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని తెలిపారు. ఆ న్యాయవాది ముగ్గురు భార్యలు ఈ విషయమై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నయీముద్దీన్ రాంచీలోని సివిల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఇటీవల అతని ముగ్గురు భార్యలు అతనిని కలుసుకునేందుకు కోర్టుకు వచ్చినప్పుడు అతను వారిని నిందించడం మొదలు పెట్టాడు. దీంతో ఆ ముగ్గురు భార్యలు అతనిపై చేయిచేసుకున్నారు. నయీముద్దీన్ మొదటి భార్య అదే సివిల్ కోర్టు ఉద్యోగి. దీంతో ఆమె సహోద్యోగులు ఆమెకు సహకారం అందిస్తూ, ఆ న్యాయవాదిపై దాడి చేశారు. ఈ ఉదంతంపై భార్యల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.