. కేసులు నమోదైన కుటుంబాలకు చంద్రబాబు ఫోన్ . అంగళ్లు, పుంగనూరు ఘటనల్లో టీడీపీ కార్యకర్తలపై కేసులు . ఇప్పటి వరకు 81 మంది అరెస్టు . అరెస్టయిన వారిని బయటకు తెస్తామని హామీ . ఇందుకు కారకులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక
హైదరాబాద్, న్యూస్లీడర్, ఆగస్టు 11 : చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో అక్రమ కేసుల బాధితుల కుటుంబాలతో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఇటీవల అంగళ్లు, పుంగనూరులలో రేకెత్తిన ఘర్షణల్లో వందలాది మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులపై కేసులు నమోదయ్యాయి. చంద్రబాబుపైనా పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు 12 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 317 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 81 మందిని అరెస్టు చేశారు.
ఈ నేపథ్యంలో బాధితుల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు. మీ కుటుంబాలకు పార్టీ పూర్తిగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. తప్పుడు కేసులో కోర్టులో నిలబడవని ధైర్యం చెప్పారు. అక్రమ అరెస్టులు తనను బాధించాయన్నారు. న్యాయపోరాటం ద్వారా అందరినీ వీలైనంత త్వరగా బయటకు తీసుకొస్తామని చెప్పారు. అక్రమ కేసులు బనాయించి వందల కుటుంబాలను క్షోభకు గురిచేసిన వారిని వదిలిపెట్టబోమని, ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.