నవ్వు, ఏడుపు, కోపం, పగా ఇవన్నీ కేవలం మనుషులకే పరిమితం అనుకుంటాం. అయితే ఈ భావోద్వేగాలకు జంతువులు కూడా మినహాయింపు కాదు. కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. తాజాగా వరంగల్లో జరిగిన ఓ ఘటన చూస్తే జంతువులు కూడా పగా తీర్చుకుంటాయా.? అన్న ప్రశ్న తలెత్తక మానదు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత కోతులు పగబడతాయా.? అంటే అవుననే అనుకుంటారు.
ఇటీవల వరంగల్, కరీమాబాద్లోని సరస్వతి స్కూల్ ప్రాంతంలో ఆటో ఢీకొని ఓ కోతి పిల్ల మరణించింది. దీంతో అక్కడే ఉన్న తల్లి కోతి బిడ్డను రోడ్డుపై నుంచి పక్కకు లాక్కేళ్లేందుకు ప్రయత్నించింది. అయితే అదే సమయంలో ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ కోతుల గుంపు ఒక్కసారిగా దూసుకొచ్చింది. వందలాది కోతులు గుంపులు గుంపులుగా ఆ ప్రాంతాకి వచ్చాయి. అటుగా వెళ్తున్న వారిపై దండయాత్ర చేశాయి. తమ జాతికి చెందిన జీవి ప్రాణాలు తీశారన్న పగో, మరెంటో కానీ ప్రజలపైకి ఎగబడ్డాయి.
ఈ క్రమంలో కొందరు వాహనదారులకు గాయాలు కూడా అయ్యాయి. కోతుల బీభత్సం చూసి అటుగా వెళ్తున్న ప్రజలు, వాహనాలను రోడ్డుపైనే వదిలేసి పరుగులు పెట్టారు. అనంతరం చనిపోయిన ఆ పిల్ల కోతిని అక్కడి నుంచి తీసుకెళ్లాయి. సుమారు గంటసేపు కోతులు బీభత్సాన్ని సృష్టించాయి. ఎవరైనా మనిషి చనిపోతే ఫోన్లలో సమాచారం ఇస్తేనే సకాలంలో బంధుమిత్రులు చేరుకోరు.. అలాంటిది ఏ సమాచారం లేకపోయినా ఈ మూగ జీవులకు ఎలా తెలిసింది..? ఇన్ని వందలాది కోతులు అంత తక్కువ సమయంలో ఎలా చేరుకున్నాయి.? అని స్థానికులు చర్చించుకున్నారు.