హైదరాబాద్, న్యూస్లీడర్, ఆగస్టు 12 : చందానగర్లో జాతీయ రహదారికి అనుకొని ఉన్న తపాడియాస్ మారుతిమాల్లో శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు అలుముకొని 5వ అంతస్తులో ఉన్న మల్టీఫ్లెక్స్ సినిమా హాలులోకి మంటలు వ్యాపించాయి. ఇందులో ఉన్న ఐదు స్క్రీన్లలో 3 స్క్రీన్స్ పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. వెంటనే అక్కడకు డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది చేరుకొని నాలుగు ఫైరింజన్లతో వేరే అంతస్తుల్లోకి మంటలు వ్యాపించకుండా అదుపులోకి తీసుకువచ్చారు.
తెల్లవారు జామున కావడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే మాల్లో మంటలు ఎలా చెలరేగాయి, కారణాలు ఏమిటనే విషయం తెలియాల్సి ఉంది. ఈ తపాడియా మాల్ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో ఇంకా పూర్తి స్థాయిలో షాప్స్ తెరుచుకోలేదు. భారీ ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వైద్యాధికారి కార్తీక్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.