. హవాయి ద్వీపంలో విషాదం మిగిల్చిన కార్చిచ్చు
.ఎటు చూసినా కాలిన శవాలే..
. బూడిదైన హవాయి స్వర్గధామం
. 67 మంది మృత్యువాత
. పచ్చదనం కనుమరుగు
లహైనా : హవాయి దీవులను కార్చిచ్చు నామరూపాలు లేకుండా చేసింది. కొన్ని రోజుల క్రితం వరకు పచ్చదనానికి ప్రతీకగా ఉన్న ఈ దీవులు ఇప్పుడు బూడిదమయంగా తయారయ్యాయి. ఇప్పటి వరకూ 67 మంది చనిపోయినట్టు సమాచారం. వేలాది ఇళ్లు భష్మీపటలమయ్యాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ పర్యాటక ప్రాంతం ఇప్పుడు బూడిదమయంగా మారిపోయింది. ఇళ్లు, చెట్లు, సంపద సర్వస్వం మాడిమసైపోయాయి.
హవాయి దీవుల సమూహంలో ఒకటైన మౌయి దీవిలోని లహైనా పట్టణంలో గత మంగళవారం రాత్రి కార్చిచ్చు మొదలైంది. అంతకంతకూ పెరుగుతూ మంటలు రేపింది. దీంతో స్థానిక ప్రజలు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమించినా అప్పటికే పరిస్థితి విషమించింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుదూరంలో హరికేన్ ఏర్పడడంతో ఈదురుగాలులు తోడయ్యాయి. దీంతో క్షణాల్లో పట్టణమంతా మంటలు వ్యాపించాయి. చూస్తూ ఉండగానే పట్టణమంతా బుగ్గిపాలైంది. శ్మశానంలా తయారైంది. ఇల్లూ-వాకిలి, చెట్టూచేమ, గొడ్డూగోదా సర్వం మాడిమసైపోయాయి. ఇప్పుడు ఏ వైపు చూసినా కాలిన మృతదేహాలు.. దగ్ధమైపోయి మొండి గోడలతో ఉన్న ఇళ్లు, హృదయ విదారక దృశ్యాలే కన్పిస్తున్నాయి.
సర్వస్వం బూడిదమయం
కార్చిచ్చు విజృంభణకు లహైనా పట్టణంలో వేల నివాసాలు, ఇతర సుందర భవనాలు కాలిబూడిదయ్యాయి. రోడ్డు మీద ఉన్న వాహనాలు నామరూపాల్లేకుండా దగ్ధమయ్యాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. వస్తువులు కాలిపోగా మిగిలిన నిప్పురవ్వలు జ్వలిస్తూనే ఉన్నాయి. వందల సంఖ్యలో పెంపుడు జంతువులు, ఇతర ప్రాణులు మంటల్లో కాలిపోయాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 67 మంది ప్రాణాలు కోల్పోగా.. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కార్చిచ్చు కారణంగా వేల మంది నిరాశ్రయులయ్యారు. సర్వం కోల్పోయి తమ భవిష్యత్తు ఏమిటో అర్థం కాక అయోమయంలో పడిపోయారు.
నిర్లక్ష్యమే కొంపముంచింది
కార్చిచ్చు గురించి ప్రజలను అప్రమత్తం చేయడంలో అధికారులు నిర్లక్యంగా వ్యవహరించినట్లు విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. మంటలు నివాసాల సమీపానికి చేరే ముందు హవాయి ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎలాంటి వార్నింగ్ సైరన్లు మోగించలేదని రికార్డుల్లో తెలిసింది. అందుకు బదులుగా మొబైల్ ఫోన్లు, టీవీలు, రేడియో స్టేషన్ల ద్వారా అలర్ట్ సందేశాలు పంపించారట. అయితే అప్పటికే కార్చిచ్చు కారణంగా చాలా చోట్ల విద్యుత్, మొబైల్ సిగ్నళ్లు లేకపోవడంతో ప్రజలకు ఈ సందేశాలు చేరలేదని తెలుస్తోంది. దీంతో వారు అప్రమత్తం చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. దీనివల్లే అధిక ప్రాణనష్టం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఇది ఆస్తి నష్టం పరంగా హవాయి చరిత్రలోనే రెండో అతిపెద్ద విపత్తు అని అధికారులు చెబుతున్నారు. మౌయి దీవిలో ఉండే ఈ పట్టణానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఒకప్పుడు హవాయిన్ రాజ కుటుంబం ఇక్కడ నివసించింది. ప్రస్తుతం ఇక్కడ 12 వేల మంది నివాసం ముంటున్నారు. పర్యాటకంగానూ ఈ నగరం ప్రత్యేకమైనది.