ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా తనని అరెస్ట్ చేస్తారంటూ చెప్పడం అధికార పార్టీకి అస్త్రంగా మారింది. సానుభూతి కోసం చంద్రబాబు గేమ్స్ ఆడుతున్నారని.. తప్పు చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని వైసీపీ అంటోంది. అయితే దేనికైనా సిద్ధమేనంటోంది తెలుగుదేశం పార్టీ. రేపోమాపో తనను అరెస్టు చేస్తారని, లేకుంటే దాడి చేస్తారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి.
118 కోట్ల రూపాయల లెక్కచూపని ఆదాయం వ్యవహారంలో ఐటీ నోటీసులు అందుకున్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది. ఇదే అంశంలో సీఐడీ కూడా రంగంలో దిగుతుందన్న వార్తల మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. తప్పు చేసినవాళ్లకే భయం ఉంటుందని.. చంద్రబాబు అక్రమాలకు పాల్పడితే ఖచ్చితంగా అరెస్టు ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఇన్ఫ్రా కంపెనీల నుంచి లంచాలు తీసుకున్న చంద్రబాబు… స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లోనూ స్కాములకు పాల్పడ్డారని ఐటీ విచారణలో వెలుగులోకి వస్తోంది. అయితే ప్రతి అంశంలో చంద్రబాబుకి మద్దతు ఇస్తున్న లెఫ్ట్, జనసేన, బీజేపీలు నోటీసులపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నాయకులు.
అటు టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేస్తారన్నది ప్రచారమేనని.. అలాంటి అవకాశమే లేదంటున్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. ఇక రాష్ట్రంలో అరాచక పాలనను ప్రశ్నించిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారాయన. మొత్తానికి చంద్రబాబు నిజంగానే అరెస్టుకు భయపడుతున్నారా? వైసీపీ మైండ్గేమ్ ఆడుతుందా? కేంద్రం ఇచ్చిన నోటీసులపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆరా తీస్తోంది? వీటనన్నింటికీ త్వరలోనే సమాధానం దొరికే అవకాశం ఉంది. ఓవరాల్గా చంద్రబాబు ముడుపులు వ్యవహారం టీడీపీతో పాటు జనసేన, బీజేపీ, లెప్ట్ పార్టీలను కూడా 2024 ఎన్నికల ముందు ఇరుకున పెట్టేశాయి.