స్కిల్ కుంభకోణంలో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. హైకోర్టు బుధవారం క్వాష్ పిటిషన్ను వాయిదా వేస్తూ తీర్పు ఇచ్చిన అనంతరం.. ఈ రోజు మా నినాదం ఇదే.. అంటూ గురు గోవింద్ సింగ్ సూక్తిని ఆయన ఉటంకించారు. ‘అన్ని విధాలుగా ప్రయత్నించినా న్యాయం కనుచూపు మేరలో లేదని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాడటమే సరైనది’ అని ట్వీట్ చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్లో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది.
చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం వరకు విచారణ చేపట్టవద్దని విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ వాదన వినకుండా ఈ కేసులో ప్రస్తుత దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడం సాధ్యం కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.