ఆసియా కప్ 2023 ఫైనల్లో భారత్ ప్రత్యర్థిగా శ్రీలంక నిలిచింది. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో పాకిస్థాన్ను 2 వికెట్ల తేడాతో (డక్ వర్త్ లూయిస్ ప్రకారం) ఓడించిన శ్రీలంక ఆసియా కప్ హిస్టరీలో 12వ సారి ఫైనల్కు అర్హత సాధించింది. చివరి బంతి వరకు విజయం దోబూచులాడిన ఈ మ్యాచులో చివరకు శ్రీలంకనే గెలుపొందింది.
ఈ మ్యాచులో టాస్ గెలిచి పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే వర్షం కారణంగా మ్యాచును తొలుత 45 ఓవర్లకు ఆపై 42 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 7 వికెట్ల నష్టానికి 251 రన్స్ చేసింది. వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ 73 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 86 పరుగులు చేయగా.. ఇఫ్తికర్ అహ్మద్ 40 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 47 రన్స్ చేశాడు.
అనంతరం డక్ వర్త్ లూయిస్ విధానంలో లక్ష్యాన్ని 42 ఓవర్లకు 252 పరుగులుగా సవరించారు. ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించిన కుశాల్ పెరీరా రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. నిశాంక , సమరవిక్రమతో కలిసి కుశాల్ మెండిస్ జట్టును ముందుండి నడిపించాడు. దాంతో ఓ దశలో 177/2తో నిలిచిన శ్రీలంక ఈజీగానే గెలుపొందేలా కనిపించింది. కానీ పాక్ బౌలర్లు విజృంభించడంతో స్వల్ప వ్యవధిలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. విజయానికి 43 పరుగులు అవసరమైన దశలో మంచి ఫామ్లో ఉన్న కుశాల్ మెండిస్ ఔట్ అవడం మ్యాచును మలుపుతిప్పింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శనక సైతం అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు.
విజయానికి చివరి రెండు ఓవర్లలో 12 పరుగులు అసరమైన దశలో శ్రీలంక 240/5తో నిలిచింది. క్రీజులో చరిత్ అసలంక, ధనుంజయ డిసిల్వ ఉండటంతో విజయంపై శ్రీలంక శిబిరం ధీమాగా ఉంది. అయితే తొలు మూడు బంతులకు 3 పరుగులు మాత్రమే ఇచ్చిన షాహీన్ అఫ్రిదీ.. 4, 5 బంతులకు డిసిల్వా, దునిత్ వెల్లలాగేను ఔట్ చేశాడు. చివరి బంతికి ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు.
ఈ దశలో చివరి ఓవర్లో శ్రీలంక విజయానికి 8 పరుగులు అవసరం అయితే తొలు మూడు బంతులకు బౌలర్ జమాన్ 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. నాలుగో బంతికి మధుశాన్ రనౌట్ అవడంతో టెన్షన్ పీక్స్కు చేరింది. ఐదో బంతికి ఫోర్ కొట్టిన అసలంక.. చివరి బంతిని డీప్ స్క్వేర్ లెగ్ దిశగా ఆడి 2 పరుగులు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. 47 బంతుల్లో 49 పరుగులు చేసి జట్టును ఫైనల్కు చేర్చాడు. దాంతో పాక్ ఇంటిబాట పట్టగా.. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి.