ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై మణిపాల్ ఆస్పత్రి బులిటెన్ విడుదల చేసింది. కడుపు నొప్పి సంబంధిత సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరారని తెలిపింది. అయితే, ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. తీవ్రమైన అపెండిసైటిస్తో బాధపడుతున్నట్టు తేలిందని పేర్కొంది.
గవర్నర్కు రోబోటిక్ అసిస్టెడ్ అపెండిసిటోమీ విజయవంతంగా నిర్వహించినట్టు ఆస్పత్రి బులిటెన్లో వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలిపింది. కడుపు నొప్పి రావడంతో అస్వస్థతకు గురైన గవర్నర్ సోమవారం తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అపెండిసైటిస్ సర్జరీ జరిగిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వివరించారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.