వినాయక చవితి పర్వదినాన ఓ ఆర్టీసీ బస్సు కండక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
నర్సాపూర్కు చెందిన సాయితేజకి తన తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణిచడంతో ఆయన స్థానంలో కండక్టర్ ఉద్యోగం వచ్చింది. అయితే, మద్యానికి బానిసైన యువకుడు విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురై నర్సాపూర్ ఆర్టీసీ డీపో సమీపంలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
గమనించిన డిపో సెక్యూరిటీ సిబ్బంది మంటలు ఆర్పారు. అనంతరం సాయితేజను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన సాయితేజ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.