తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓటర్లకు కీలక సూచన తెలియజేసారు. కాంగ్రెస్ డబ్బులు ఇస్తే తీసుకోండి. కానీ ఓటు మాత్రం కేసీఆర్కి వెయ్యండని పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలంగాణ లో ఎన్నికల హడావిడి మొదలైనట్లే. మరో రెండు నెలల్లో ఎన్నిలకు రాబోతున్నాయి. డిసెంబర్ 07 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలో అధికార పార్టీ తో పాటు మిగతా పార్టీలన్నీ కూడా ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే బిఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించగా…కాంగ్రెస్ , బిజెపి పార్టీలు సైతం తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారు.
మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. గంభీరావుపేట మండల పరిధిలోని 4 గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించిన పత్రాలను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఒకే రోజు నాలుగు గ్రామాల్లో 378 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అలాగే కాంగ్రెస్ కురిపిస్తున్న హామీల ఫై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేతలు ఎప్పుడు పదవుల కోసం కొట్టుకుంటారని , వారి పదవులపై వారికే గ్యారెంటీ లేదన్నారు. అలాంటి పార్టీ ప్రజలకు గ్యారెంటీ కార్డులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిని ప్రజలు నమ్ముతారని వారు అనుకోవడం వారి కర్మ అన్నారు. కాంగ్రెస్ పార్టీ లేనిపోని హామీలు ఇస్తూ ప్రజల్ని ఆయోమయానికి గురిచేస్తోందన్న ఆయన.. రాష్ట్ర ప్రజలు పొరపాటున కాంగ్రెస్కు ఓటు వేస్తే మన బ్రతుకులు తిరిగి పాత రోజుల్లోకి వెళ్తాయన్నారు. లేనిపోని హామీలు ఇస్తున్న కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో డబ్బులు ఇవ్వం అని చెప్పే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న డబ్బులు తీసుకొని బీఆర్ఎస్కు ఓటు వేయండని పిలుపునిచ్చారు.