KVB PURAM | నెల్లూరు జిల్లాలో కావలి, కడప జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్పై దాడి ఘటన మరువక ముందే KVB PURAM మండలంలో మరోసారి సంఘటన చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి డిపో బస్సును శ్రీకాళహస్తి-పిచ్చాటూరు మార్గమధ్యలో డ్రైవర్ వినోద్కుమార్ ప్రయాణికులను ఎక్కించుకుని బయలుదేరారు. తొట్టంబేడు మండలం శివనాథపురం వద్ద బస్సుకు ముందు నడిరోడ్డుపై మద్యం మత్తులో ద్విచక్రవాహనంపై వెళ్తున్న మైసూరారెడ్డి, షణ్ముగంలను దాటుకుని వెళ్లడానికి హారన్ కొట్టి క్రాస్ తీసుకుని ముందుకు వెళ్లాడు.
అనంతరం కొత్తకండ్రిగ వద్దకు వచ్చిన తరువాత ప్రయాణికులను దింపుతున్న సమయంలో బస్సుకు అడ్డంగా వచ్చి ఆర్టీసీ డ్రైవర్ను దుర్భాషలాడారు. దీనిని డ్రైవర్తో పాటు ప్రయాణికులు కొంత మంది అల్లరిమూకలపై తిరగబడటంతో ఈమార్గంలో ఎలా నడుపుతావో చూస్తాంరా అంటూ హుకుం జారీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కేవీబీపురం మండలం తిమ్మసముద్రం సమీపంలోకి వచ్చేసరికి అక్కడ సుమారు 10 మంది అల్లరిమూకలను వెంటపెట్టుకుని మైసూరారెడ్డి శ్రీకాళహస్తి-పిచ్చాటూరు ప్రధానమార్గంపై బస్సుకు అడ్డంగా నిలబడి కర్రలు, రాళ్లతో బస్సును కొడుతూ డ్రైవర్పై దాడికి దిగారు. ప్రయాణికులు డ్రైవర్ను కొట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ దాడి చేశారు. సంఘటనపై కేవీబీపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వినోద్కుమార్ తెలిపారు. విచారిస్తున్నామని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సునీల్ తెలిపారు.