TIRUPATHI | ఆంధ్రప్రదేశ్లో బస్ డ్రైవర్లు హారన్లు కొట్టడమే మహా పాపం అయిపోతోంది. రోడ్డుకి అడ్డుగా ఉన్నారని లేదా సైడ్ ఇవ్వమని హెచ్చరిస్తూ హారన్ కొట్టినా పట్టుకుని మరీ చితకబాదేస్తున్నారు. తిరుపతిలో నడిరోడ్డుపై పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న కొందరు యువకులు.. హారన్ కొట్టాడని ఓ బస్సు డ్రైవర్పై దాడి చేశారు. ఈ ఘటన తిరుపతిలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతిలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన శివ, శశి స్నేహితుల పుట్టినరోజు వేడుకలను గురువారం అర్ధరాత్రి స్థానిక శంకరంబాడి సర్కిల్ సమీపంలోని ఎంఆర్ఎఫ్ షోరూం వద్ద ప్రధాన రోడ్డుపై నిర్వహించారు. ఆరుగురు యువకులతో కలిసి నడిరోడ్డుపై ద్విచక్రవాహనాలు అడ్డు పెట్టి కేకులు కోస్తూ హడావుడి చేశారు. అదే సమయంలో అభిషేక్ ట్రావెల్స్కు చెందిన బస్సు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తూ ఆ మార్గంలోకి ప్రవేశించింది. రోడ్డుకు అడ్డుగా ఉన్న యువకులు తప్పుకోవాలని బస్సు డ్రైవర్ గణేష్ హారన్ కొట్టారు.
ఆగ్రహించిన యువకులు బస్సుపై రాళ్లు రువ్వారు. దీంతో బస్సు పక్క అద్దాలు పగిలాయి. వారిని అడ్డుకోబోయిన డ్రైవర్ను తీవ్రంగా కొట్టారు. ఇంతలో పోలీసులు రావడంతో యువకులు పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. డ్రైవర్ను కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గంజాయి తీసుకోవడం వల్లే ఆ యువకులు అలా ప్రవర్తించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.