KARIMNAGAR | తెలంగాణ ఎన్నికల్లో పెద్ద ఎత్తున తాయిలాలు ఓటర్లకి అభ్యర్థులు ఇవ్వబోతున్నారట. మరీ ముఖ్యంగా ములుగు నియోజకవర్గంలో తనను ఓడించేందుకు వైరి వర్గం ఓటుకు రూ.5వేలు పంచుతోందంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క ఇటీవల ఆరోపించారు. ఇప్పుడు కరీంనగర్ లో తనను ఓడించేందుకు ఓటుకు రూ.10వేలు, యువతకు సెల్ ఫోన్ ఇస్తున్నారంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పోలింగ్ ముంగిట కరీంనగర్లో ప్రచారం ముమ్మరం చేసిన బండి.. తన ప్రత్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. భూకబ్జాలతో గంగుల కోట్ల రూపాయలు సంపాదించారని, ఆ డబ్బులో కొంత ఎలక్షన్ లో ఖర్చు చేయబోతున్నారని అన్నారు. ఓటుకు రూ.10వేలు, యువతకు పంచి పెట్టేందుకు 5వేల సెల్ ఫోన్లు తెప్పించారని ఆరోపించారు బండి. అయినప్పటికీ గంగులకు ఓటమి ఖాయమని కేసీఆర్ కు ఎప్పుడో తెలుసన్నారు. అందుకే చాలా రోజులు ఆయనకు బీ-ఫాం ఇవ్వలేదని చెప్పారు. కానీ.. గత ఎన్నికల్లో గంగుల చేతిలోనే బండి సంజయ్ ఓడిపోయారు.
కరీంనగర్ లో గంగుల గెలిస్తే బొట్టు పెట్టుకుని, కంకణం కట్టుకుని నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి లేదన్నారు బండి సంజయ్. హిందువుల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీల్చి, ఆ పార్టీకి మేలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మొత్తంమ్మీద కరీనంగర్ లో బీజేపీకి వ్యవహారం తేడాకొట్టేలా ఉందని తెలిసే, ఓటుకు నోటు, సెల్ ఫోన్ అంటూ బండి ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.