TELANGANA ELECTIONS | హాయ్ ఫ్రెండ్స్.. నేను మీ బర్రెలక్కను అంటూ సోషల్ మీడియా ద్వారా ఇన్నాళ్లూ పలకరించిన శిరీష.. కేవలం ఒక్క వీడియోతో కేసీఆర్ సర్కార్కు చుక్కలు చూపించింది. ఎంత చదివినా సర్టిఫికెట్లు మాత్రమే వస్తాయి.. నోటిఫికేషన్లు రావు.. అందుకే నేను మా అమ్మను అడిగి నాలుగు బర్రెలు కొనుక్కున్న.. రోజుకు రూ300 సంపాదన గ్యారెంటీ.. బంగారు తెలంగాణలో చదువుకోవడం కన్నా బర్రెలు కాసుకోవడం నయం అంటూ ఆమె చేసిన వీడియో అప్పట్లో సంచలనంగా మారింది.
బర్రెలక్కగా ఫేమస్ అయిన ఈ శిరీష టాక్ ఆఫ్ తెలంగాణ ఎలక్షన్స్గా మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన శిరీష దళిత బిడ్డ. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ శిరీష చేసిన వీడియో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపింది. అటూ ఇటూ తిరిగి ఈ వీడియో తెలంగాణ సర్కార్ కంట పడింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
ఈ కేసును కొట్టివేయించుకునేందుకు శిరీష కోర్టుల చుట్టూ తిరుగుతోంది. కానీ ఎంత ప్రయత్నించినా కేసుల నుంచి బయటపడలేదు. కేసు కొట్టివేయించుకునేందుకు శిరీష చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో విసిగిపోయిన శిరీష తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో శిరీష మరింత ఫేమస్ అయింది. ఆడపిల్ల, దళిత బిడ్డ అయి ఉండి కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న తీరును సోషల్ మీడియాలో నిరుద్యోగులు, వివిధ పార్టీలన నేతలు వైరల్ చేస్తున్నారు.
నామినేషన్ల ఉప సంహరణ పూర్తి కావడం, కొల్హాపూర్ బరిలో బర్రెలక్క నామినేషన్ ఉప సంహరించుకోకపోవడంతో ఇప్పుడు మీడియా దృష్టి అంతా ఆమెపై పడింది. శిరీష ఇంటర్వ్యూ కోసం యూట్యూబ్ చానెళ్లతోపాటు మెయిన్ స్ట్రీం మీడియా కూడా శిరీష ఇంటికి క్యూ కడుతోంది. ఇంటర్వ్యూలతోపాటు తన ఇన్స్ట్రాగ్రాం ఖాతాలో కూడా శిరీష ఒకటే విషయం చెబుతున్నారు. తాను ఎన్నికల్లో ప్రచారం చేసుకోలేనని, ప్రధాన పార్టీల అభ్యర్థులకు తగినట్లుగా ప్రచారం చేసేంత డబ్బు తనవద్ద లేదని చెబుతోంది. నిరుద్యోగులు, యువకులు ఆలోచించి ఓటు వేయాలని కోరుతోంది. దీంతో కోట్లు పెట్టినా రాని పబ్లిసిటీ.. ఇప్పుడు బర్రెలక్కకు వస్తోంది.